ప్రాణహిత జులై 2008 సంచిక

ప్రాణహిత జూలై సంచికకు స్వాగతం. ఈ సంచికతో ప్రాణహిత ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నది. గత సంవత్సర కాలంలో ప్రాణహిత పదకొండు సంచికలు వెలువడింది. తెలుగు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలని ప్రతిఫలించే సాహిత్యాన్ని అంతర్జాతీయ పాఠకులకు అందించడానికి పూనుకున్న ప్రాణహిత, ఒక సంవత్సర కాలంగా నిరాఘాటంగా వెలువడడం చెప్పుకోదగ్గ విజయంగా మేము భావిస్తున్నాము., మీ ప్రోత్సాహం, క్రియాశీలక భాగస్వామ్యం, సలహాలు సూచనలూ లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. అందుకు కారణమైన మీ అందరికీ ప్రాణహిత వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది. మీ అందరికీ కానుకగా జూన్ సంచికను జూలై సంచికతో కలిపి ప్రత్యేక వార్షిక సంచికగా మీముందుకు తెస్తున్నాము. ఈ ప్రత్యేక వార్షిక సంచికలో మీ కోసం మరిన్ని కవితలు, కథలు మరియు ప్రత్యేక సాహిత్య వ్యాసాలు అందిస్తున్నాము.

జూన్, జూలై నెలలు తెలుగు సాహిత్య చరిత్రలో చాలా ప్రాముఖ్యత గలవి. 1970 లో విశాఖ పట్నంలో మహాకవి శ్రీ శ్రీ షష్టి పూర్తి, ఆ సందర్భంగా విశాఖ విద్యార్థులు విసిరిన ‘రచయితలకు సవాల్ ‘, తర్వాత విప్లవ రచయితల సంఘం ఏర్పడ్డం తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప మైలు రాళ్ళు. తెలుగు సాహిత్యంలో 60 వ దశకంలో ‘రాత్రి’ కవితా సంకలనంతో ప్రారంభమై దిగంబర కవులుగా, తిరుగబడు కవులుగా అనేక పాయలుగా పెల్లుబికిన ఆగ్రహ జ్వాలలు, విరసం ఏర్పాటుతో ఒక కార్యాచరణ రూపం దాల్చినయి. ప్రజలనుండి నేర్చుకుని ప్రజల కొరకు సాహిత్యం సృష్టించాలనీ, ప్రజలని విప్లవాచరణకు ఉద్యుక్తుల్ని చేయడమే నిజమైన ప్రజాసాహిత్యం లక్ష్యమనీ తెలుగు సాహిత్యానికి కొత్త పథ నిర్దేశం చేసింది విరసం.

‘మహాప్రస్థానం’ తో తెలుగు సాహిత్యాన్ని కొత్త మలుపు తిప్పిన మహాకవి శ్రీ శ్రీ, విరసం ఏర్పాటులో ప్రముఖ పాత్ర నిర్వహించి, నిర్మాణంలో భాగమై తన ‘మరో ప్రస్థానం’ ప్రారంబించాడు. విరసంతో, విప్లవ సాహిత్యోద్యమంతో బుజం బుజం కలిసి పీడిత ప్రజల ‘రెక్క విప్పిన రివల్యూషన్’ అయ్యాడు. ‘హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. పద్యాలు చదువుతుంటే ఇవి మాటలు కావు, అక్షరాలు కావు – ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు – అతని హృదయంలోంచి మన హృదయంలోకి direct గా పంపిన ఉత్సాహాలు, నెత్తురు కాల్వలనిపిస్తుంది. అందరి బాధనూ తన కవిత్వంలో పలికించిన శ్రీ శ్రీ బాధ ప్రపంచపు బాధ! ‘భారత దేశపు అధ్యక్షుడు కావడం కన్నా విరసం అధ్యక్షుడు కావడమే తనకు గొప్ప’ అని ప్రకటించిన శ్రీ శ్రీ 1983 జూన్ నెలలో అమరుడయ్యాడు. తెలుగు కవిత్వాన్ని వూగించి శాసించి ఖండించి దీవించిన మహాకవి శ్రీ శ్రీ అమరుడయ్యి 25 ఏళ్ళు గడచిన సందర్భంగా ప్రాణహిత ఘనంగా నివాళులర్పిస్తున్నది. సంక్షుభితమవుతున్న ఈనాటి సామాజిక సందర్భంలో మరింత ప్రస్ఫుటంగా ద్విగుణీకృతమవుతున్న శ్రీ శ్రీ రిలవన్స్ నూ, సాహిత్యంలో అతను చూపిన మార్గాన్నీ గుర్తు చేసుకుంటున్నది. ఈ సందర్భంగా ఎన్ . వేణుగోపాల్ వ్యాసాన్ని మీ కందిస్తున్నది.

Polepally villagers protesting in front of APIIC office hyderabad (image courtesy : Eenadu)
Polepally villagers protesting in front of APIIC office hyderabad (image courtesy : Eenadu)

తెలంగాణ పాలమూరు జిల్లాలో పోలెపల్లి లో ఒక మహత్తర పోరాటం జరుగుతున్నది. అక్కడ ఏర్పడబోతున్న సెజ్ కు వ్యతిరేకంగా రైతాంగం మున్నెన్నడూ లేనంతగా వుధృతంగా పోరాడుతున్నారు. తమకున్న కొద్దిపాటి భూముల్నీ, జీవనాధారాన్నీ కోల్పోయి అత్యంత పేదరికంలోకి నెట్టివేయబడుతున్న నిరుపేద రైతాంగం తమ ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తూ అనేక రూపాల్లో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తమకు నిలువ నీడ దక్కాలని, న్యాయం జరగాలని ఎలుగెత్తుతున్నారు. పోలేపల్లి ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రాణహిత పూర్తి మద్దతునిస్తూ వారి పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తున్నది. వారిని నిరాశ్రయుల్ని చేసి బహుళజాతి సంస్థలకు, వాటి యజమానులకు మరిన్ని లాభాలని ఆర్జించేందుకు , ధనిక వర్గాల పక్షం వహించిన ప్రభుత్వ చర్యలని ప్రాణహిత వ్యతిరేకిస్తున్నది. సెజ్ ల నిర్మాణలోనే ఒక ప్రజావ్యతిరేక కుట్ర ఉన్నదని దేశవ్యాప్తంగా సెజ్ లకు వ్యతిరేకంగా నిరుపేద రైతాంగం కొనసాగిస్తున్న పోరాటాలు ఎలుగెత్తి చాటుతున్నయి. నందిగ్రాం నుండి పోలేపల్లి దాకా ప్రజలు తమ ప్రజాస్వామిక పోరాటాలతో కొత్త చరిత్ర ను నిర్మిస్తున్నారు. వారి ఆకాంక్షలతో ప్రాణహిత గొంతు కలుపుతున్నది.ఈ ప్రత్యేక వార్షిక సంచికలో ప్రాణహిత మీ కోసం పి. చంద్ రాసిన ‘ఎన్నికలు’ , అద్దేపల్లి ప్రభు రాసిన ‘వీరవేణి’ , మంచికంటి రాసిన ‘విభజన రేఖలు’ కథలు అందిస్తున్నది.
వ్యాసాల్లో తెలంగాణ కవిత్వంపై డా||రూప్ కుమార్ డబ్బీకర్ సమీక్షా వ్యాసాన్ని, డా|| దేవరాజు మహారాజు ‘ సాహిత్య కళారంగాలు అంతరించిపోతున్నాయా?’, పినాకపాణి రాసిన ‘ముస్లిం సాహిత్య ధోరణిలో అంతర్గత సమస్యలు’ తదితర వ్యాసాల్ని అందిస్తున్నది. గత 20 ఏండ్లుగా నిరాఘాటంగా ప్రజాస్వామిక విలువలని ప్రతిబింబించే పుస్తకాలని ప్రచురిస్తూ వస్తున్న పర్స్పెక్టివ్స్ ప్రచురణ సంస్థ ను పరిచయం చేసే వ్యాసాన్ని చదవండి.

కవితల్లో విమల రాసిన ‘మేఘమా మేఘమా’, ‘గురి’ , పి.మోహన్ ‘నువ్వు బతికే ఉన్నావా , చివరకు మిగిలింది’, చల్లపల్లి స్వరూప రాణి ‘విధ్వంసం’ , దాట్ల దేవదానం రాజు ‘నది చుట్టూ నేను’ . షేక్ కరీముల్లా ‘ ఓ నా ప్రియమైన శత్రువా’, ముకుంద రామారావు ‘మొదటి స్నానానికీ చివరి స్నానానికీ మధ్య’ , గందికోట వారిజ ‘ కరగని కల’ , పలమనేరు బాలాజీ ‘ శిశుదశ’ , బెల్లంకొండ రవికాంత్ ‘స్నేహిత’ , స్వాతి శ్రీపాద ‘జర భద్రం బిడ్డో’, హరగోపాల్ ‘వానకారు’, చైతన్య ప్రకాష్ ‘ చెమట చిమ్ముతూ’ చదవండి.
హిమబిందు కాలమ్ ‘అవేర్నెస్ ‘ నీ, మేరీ బ్రేవ్ బర్డ్ ‘లకోట వుమన’ కి మమత అనువాదం తరువాయి అధ్యాయాన్నీ, ఆంటొనియో స్కార్మెటా ‘పోస్ట్ మాన్ ‘ కి వేణుగోపాల్ అనువాదం తరువాయి భాగాన్నీ చదవండి. రోహిణీ ప్రసాద్ ప్రత్యేక సైన్సు వ్యాసాన్ని చదవండి.

సూచిక:-
కవితలు:

కథలు:

ప్రపంచ సాహిత్యం:

కాలమ్:

వ్యాసాలు:

వ్యాసాలు:

అభిప్రాయాలు లేవు »

Comments are closed.

Trackback URI |